ఆగ్రా, 25 మే (హి.స.)
ఆగ్రాలోని తాజ్ మహల్ కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు కేరళ నుండి వచ్చిన ఓ అజ్ఞాత ఈమెయిల్ ఐడీ ద్వారా ఆర్డిఎక్స్ తో తాజ్మహల్ పేల్చివేస్తామని సందేశం అందింది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆ బాంబు పేలుతుందని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, ఢిల్లీ పోలీసులకు ఈమెయిల్ రాగా అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, తాజ్ సెక్యూరిటీ పోలీస్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పర్యాటక పోలీస్, ఏఎస్ఐ అధికారులు మూడు గంటలపాటు తాజ్మహల్లోని ప్రధాన గోపురం, జాస్మిన్ ఫ్లోర్, మసీదు, ఉద్యానవనాలు, కారిడార్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఫేక్ బెదిరింపులుగా ప్రకటించారు. ఆగ్రా పోలీస్ సైబర్ సెల్లో కేసు నమోదు చేసి, ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ బెదిరింపులతో ఆదివారం ఉదయం నుంచి పర్యటకులను తాజ్ లోకి అనుమతించలేదు. తాజ్మహల్ అన్ని గేట్ల వద్ద నిఘా పెంచి, సీసీటీవీ ద్వారా పర్యాటకులను పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..