అమరావతి, 25 మే (హి.స.)
దేవుడి లీలలు ఎలా ఉంటాయో ఊహించటం చాలా కష్టం. తినడానికి తిండి కూడా సరిగా లేని వాళ్లను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తాడు. కుబేరులను బికారుల్ని చేస్తాడు. అదృష్టం దేవుడి లీలే అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదృష్టం ఎప్పుడు.. ఎలా తలుపు తడుతుందో తెలీదు కానీ.. ఒక్క దెబ్బతో జీవితాలే మారిపోవచ్చు. కర్నూలుకు చెందిన ఓ రైతు జీవితంలో కూడా అదృష్టం లక్కలాగా పట్టింది. ఒక్క రోజులో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు.
ఇంతకీ సంగతేంటంటే.. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దగ్గరకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా అదృష్టం ఊహించని విధంగా తలుపుతట్టింది. భారీ ధర పలికే వజ్రం దొరికింది. దీంతో రైతు సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ వజ్రం గురించి తెలుసుకున్న ఓ వ్యాపారి.. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. బేరం ఆడి.. వజ్రాన్ని 10 తులాల బంగారం, 30 లక్షల నగదుకు కొనుగోలు చేశాడు. బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ 60 లక్షల దాకా ఉంటుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ