అమరావతి, 25 మే (హి.స.) :ఏపీపీఎస్సీ గ్రూపు-1 కేసులో ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు, పమిడికాల్వ మధుసూదన్లను రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు శనివారం ఉత్తర్వులిచ్చింది. ఈ ఇద్దరు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టడానికి వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సూర్యరావుపేట పోలీసులు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. రెండు రోజుల క్రితం దీనిపై వాదనలు ముగిశాయి. రెగ్యులర్ కోర్టుకు సెలవులు కావడంతో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి అప్పారావు తీర్పు చెప్పారు. ఆదివారం ఉదయం 6 గంటలకు జైలు నుంచి పీఎ్సఆర్, మధుసూదన్లను కస్టడీకి తీసుకుని సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తిరిగి జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. జైలు నుంచి తీసుకెళ్లేటప్పుడు తిరిగి అప్పగించేటప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, జైల్లో ఉన్న పీఎ్సఆర్ శనివారం అస్వస్థతకు లోనయ్యారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉండడంతో జైలు అధికారులు ఆయన్ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు. కాదంబరి జెత్వాని కేసులో కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చినప్పుడు కూడా ఆయన బీపీలో హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ