అమరావతి, 26 మే (హి.స.)
మరోసారి మారిన కడప పేరుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గతంలో ఉన్న కడప పేరును గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ జిల్లాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, దీనిపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కడప పేరు మార్పుపై ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలుపుతూ వచ్చాయి… ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప పేరు మార్పు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది… వైఎస్సార్ పేరుతో పాటు కడప అన్న పదాన్ని కూడా చేర్చాలని ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి.. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కడప పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నెలలోపు తెలపాలని కడప కలెక్టర్ శ్రీధర్ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఈనెల 25 ఆఖరి తేదీ గడువు ముగియడంతో పాటు, ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రభుత్వానికి కడప పేరు మారుస్తూ నివేదికలు పంపారు జిల్లా అధికారులు… ఈ మేరకు ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ వైఎస్సార్ కడప జిల్లాగా ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం..
దీంతో, ఇకపై వైఎస్సార్ జిల్లా కాస్తా.. వైఎస్సార్ కడప జిల్లాగా మారిపోయిందన్నమాట.. కాగా, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇకపై వైఎస్ఆర్ కడపగా జిల్లా పేరు మార్చాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు కలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ