తెలంగాణ, సూర్యాపేట, 26 మే (హి.స.)
రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం ఏపూర్ గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసి మొలకెత్తిన వడ్లను మాజీ మంత్రి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐకేపీ కేంద్రాల్లోనే వడ్లు ముక్కి మొలకలొచ్చేస్తున్నాయని.. 60 రోజులైనా వడ్లు కొనలేదంటే ఇంతకంటే దారుణం ఉంటుందా అని మండిపడ్డారు. ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు.
రుతుపవనాలు వచ్చి దుక్కి దున్నాల్సిన రైతులు ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సి వస్తుందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు