నెల్లూరు, 26 మే (హి.స.)
నెల్లూరు జిల్లాలో అరుదైన ఘటన వెలుగుచూసింది. జొన్నవాడ కామాక్షితాయి టెంపుల్ సమీపంలోని పెన్నా నదిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. సరిగ్గా కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నదిలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి.. శక్తి స్వరూపినిగా ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచైనా కొట్టుకువచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలో జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్షేత్రం కిటకిటలాడింది. జొన్నవాడ గ్రామ వీధుల్లో రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
కాగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో అల్లూరి జిల్లాలో బంగారు వర్ణపు విగ్రహం వాగు ఉధృతిలో కొట్టుకువచ్చింది. ఇసుక మేటలో భక్తులకు అభయం ఇస్తున్నట్లుగా నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి