తెలంగాణ, రాజన్న సిరిసిల్ల : 26 మే (హి.స.)
సిరిసిల్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రోటోకాల్ వివాదం పై తీవ్ర రగడ రాజుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా ఇరు పార్టీల నేతలు సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుకుంటూ ఘర్షణ వాతావరణానికి తెర లేపారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టాల్సిందేనని, లేకపోతే అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని ఓ బీఆర్ఎస్ నేత సోషల్ మీడియా వేదికగా సవాలు విసిరాడు. అదే సోషల్ మీడియా వేదికగా ఓ కాంగ్రెస్ నేత సిరిసిల్ల క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెడతామని సవాలు విసిరాడు.
ఈ నేపథ్యంలో సోమవారం క్యాంపు కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కూడా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముందే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితులు చేయి దాటడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయినా విషయం సద్దుమనగకపోవడంతో ఇరు పార్టీల నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు