కడప ఏ.పీ, 26 మే (హి.స.)
టీడీపీ మహానాడుకు కడప ముస్తాబవుతుంది. టీడీపీ చరిత్రలో తొలిసారి కడప వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమం రేపు(మంగళవారం) ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఈ రోజు(సోమవారం) సాయంత్రం కడపకు వెళ్లనున్నారు. ఇప్పటికే సభ ప్రాంగణం వద్దకు మంత్రులంతా తరలివచ్చారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం పసుపు మయంగా మారాయి.
ఇదిలా ఉంటే.. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్గా ఉన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ తరుణంలో నిన్న (ఆదివారం) రాత్రి కురిసిన వర్షం వల్ల సభ ప్రాంగణానికి నీళ్లు రావడంతో మంత్రి నిమ్మల స్వయంగా పార పట్టి దగ్గరుండి ప్రాంగణాన్ని చదును చేశారు. ఈ సమయంలోనే ఆయన కాలు జారి పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..