అమరావతి, 26 మే (హి.స.)
: ఈసారి రుతుపవనాలు ( ముందుగానే వచ్చాయి ). ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ )లోని పలు ప్రాంతాల్లో వర్షాలు ) విస్తారంగా కురుస్తున్నాయి. కాగా సోమవారం రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గత ఏడాది 2024లో జూన్ 2న రుతుపవనాలు ఏపీలో ప్రవేశించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.
కాగా నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్లో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఏపీలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన భాగాలు, ఈశాన్య భారతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆదివారం నాటికి మధ్య మహారాష్ట్రలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిన తర్వాత దాని అవశేషాలు (ఉపరితల ఆవర్తనం) తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ అల్పపీడనంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఇది తర్వాత బలపడి ఉత్తర వాయువ్యంగా ఉత్తర ఒడిశా వైపు పయనించనుంది. దీనివల్ల రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, దానికి ఆనుకుని ఒడిశా పరిసరాల వరకు విస్తరించనున్నాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ