హైదరాబాద్, 26 మే (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కలిసి పనిచేద్దామని, వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం అత్యంత కీలక ప్రాధాన్యత అంశాలు అని భేటీలో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ భేటీపై సోమవారం రిటైర్డ్ ఐఏఎస్, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన ఎక్స్ ఖాతా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. విద్య కీలక ప్రాధాన్య అంశం అని ప్రధాన మంత్రి చెప్పారని, అబద్ధాలు ఆడడం, మోసపూరిత మాటలు మాట్లాడడం ప్రజలను వంచించడం రాజకీయ నాయకులు అలవాటు చేసుకున్నారని విమర్శించారు.
2024-25, 2025-26 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ లో బీజేపీ ప్రభుత్వం విద్యకు కేటాయింపులు 2.5 % అని, ఇది గత 20 ఏళ్లలో కనిష్టం అని పేర్కొన్నారు.
ఇక మన కేసీఆర్ అయితే ప్లాన్ ప్రకారం విద్యను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆయన చివరి ఏడాదిలో విద్య కు కేటాయించిన బడ్జెట్ 6.4 శాతం, 20 ఏళ్లలో అతి తక్కువ కేటాయింపులు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై ఆశలు పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతానికి అయితే బీజేపీ, బీఆర్ఎస్ వలన ప్రభుత్వ బడుల్లో విద్య కొన ఊపిరి తో ఉందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..