తెలంగాణ, మెదక్. 27 మే (హి.స.) జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది అంటూ కామెంట్ చేశారు ఎంపీ రఘునందన్ రావు.
మెదక్ జిల్లా తూప్రాన్ లో పర్యటిస్తున్న ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని తెలిపారు. తనకు తానుగా ఓ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుందని కామెంట్ చేశారు.
పార్టీలో అంతర్గత విబేధాలు ఉంటే.. తండ్రీకూతుళ్లు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చని, అందుకు మధ్యవర్తులు అవసరం ఏంటని ప్రశ్నించారు. గెలిచినప్పుడు కేసీఆర్ అందరికీ దేవుడయ్యాడని.. ఒక్క ఓటమి ఎదురవ్వగానే అదే కేసీఆర్ దయ్యమైండా అని సైటర్లు వేశారు. జూన్ 2న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ను విబేధించి.. పార్టీ నుంచి వైదొలిగి కొత్త పార్టీ పెట్టబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు తండ్రి కేసీఆర్ కూడా పూర్తిగా సహకరిస్తారని అన్నారు. వైఎస్ షర్మిల తరహాలోనే కవిత కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతోందని.. అది బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులపాలు చేయనుందని ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు