అమరావతి, 27 మే (హి.స.)
కడప,:తొలిసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సారి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు. కడప మహానగరం వేదికగా మంగళవారం మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఈ సభలో పార్టీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకుగానూ 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్కు ఆయన సూచించారు.
కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని పేర్కొన్నారు. అంతేకాదు.. అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. ఇక ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారని ఆయన తెలిపారు. పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారన్నారు. అలాగే ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని వివరించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను వృథా కానివ్వమని ఈ సందర్భంగా ఆయన కేడర్కు భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ