విశాఖపట్నం, 27 మే (హి.స.) నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నెల 13న అండమాన్కు వచ్చిన రుతుపవనాలు 24న కేరళను తాకాయి. అనూహ్యంగా సోమవారమే రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా 10 రోజుల ముందే తొలకరి పలకరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రుతుపవనాలు సీమలో ఎక్కువ ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో కావలి వరకూ విస్తరించాయి. సాధారణంగా జూన్ ఐదో తేదీ నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం నెలకొనడంతో పది రోజుల ముందుగానే వచ్చాయి. గత ఏడాది జూన్ రెండో తేదీన రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో బెంగళూరు, మహారాష్ట్రలో ముంబై వరకూ, తమిళనాడులో మిగిలిన భాగం, తెలంగాణలో కొద్ది ప్రాంతం, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, అసోం, మేఘాలయలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో అరేబియా సముద్రం, కర్ణాటకలో మిగిలిన ప్రాంతం, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం, ఈశాన్య భారతంలో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ వరకూ రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా మే చివరి వారంలో రోహిణి కార్తె ప్రారంభమై జూన్ తొలివారం వరకూ కొనసాగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ