అమరావతి, 28 మే (హి.స.)
భీమవరం పట్టణం ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలకు భీమవరానికి చెందిన మాదాల సూర్యహంసిని ఎంపికయ్యారు. ఆగస్టు 17 నుంచి 25వ తేదీ వరకు కెనడాలో జరిగే ఈ పోటీల్లో ఆమె భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. జట్టు ఎంపికలు ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు పుణెలో జరిగాయి. ట్రయల్స్లో సూర్యహంసినితో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రీతిక, ఉత్తరప్రదేశ్కు చెందిన వెరెన్యరాణా ఎంపికయ్యారు.
వరుస విజయాలతో.. భీమవరంలోని భారతీయ విద్యాభవన్స్లో ఇంటర్మీడియట్ చదువుతున్న సూర్య హంసిని దేశ, విదేశాల్లో జరిగిన పలు పోటీల్లో పాల్గొని విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జైపూర్లో జరిగిన కాంపౌండ్ మహిళల జాతీయ విలువిద్య పోటీల్లో కాంస్య పతకం సాధించింది. గతంలో చైనాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత జట్టు తరఫున పాల్గొని సత్తాచాటారు. ఆసియా కప్, ప్రపంచ ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్-1 పోటీల్లో రాణించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యమని సూర్యహంసిని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ