కడప, 28 మే (హి.స.)కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రసంగించారు. తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు.
జీవించాక మరణించక తప్పదు.. మరణించినా ప్రజల గుండెల్లో నిలబడటం చాలా గొప్ప విషయం అన్నారు. అలా ఉన్న వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న నారా చంద్రబాబు బాటలో అందరం నడవాలని అశోక్ గజపతి రాజు తెలిపారు. మహాత్ములని స్ఫూర్తిగా తీసుకొని నడిచిన నందమూరి నేడు మనందరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.
పసుపు అంటే పుణ్యమైన రంగు.. ఆ చక్రం శ్రమ జీవులకోసం, ఆ నాగలి రైతులకోసం ఆ గుడిసే అందరికి ఇళ్లకోసం ఇది పేదలకోసం పుట్టిన జెండా.. ప్రజలకోసం నిలిసిన పార్టీ అని చెప్పారు. ఆత్మగౌరవంతో ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించేవారని ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. మనం నిర్భయంగా పనిచేయగలితే మన ఆత్మగౌరవాన్ని పెంచుకోగలుగుతామన్నారు.
ప్రజలకోసం పనిచేసే పార్టీ.. ఆత్మగౌరవాన్ని పెంచే పార్టీ టీడీపీ అని తెలిపారు. ఎక్కడున్నా తెలుగువారి కీర్తిని చాటి చెప్పాలన్నారు. భవిష్యత్తు మన యువకులది.. అందరు కలిసి పనిచేయాలని అశోక్ గజపతి రాజు పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి