మహానాడు వేదికపై ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి
కడప, 28 మే (హి.స.) తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదిక పైనుంచి నివాళులు అర్పించారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణ
మహానాడు వేదికపై ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి


కడప, 28 మే (హి.స.) తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదిక పైనుంచి నివాళులు అర్పించారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత అని చెప్పారు. సాధారణ రైతు బిడ్డగా పుట్టిన ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాయకుడు ప్రపంచంలో ఎన్టీఆర్ మాత్రమేనని చంద్రబాబు చెప్పారు.

అధికారం అంటే బాధ్యత అని, పదవి అంటే సేవ చేసే అవకాశమని, పాలకులు అంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాలే మార్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి స్థాయి నుంచి తెలుగు సినీరంగంలో ఎవరెస్టుగా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం అనితర సాధ్యమని, మన కళ్లముందు కనిపించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ జీవితమేమీ పూలపాన్పు కాదని, నిరంతరం పోరాటాలతోనే ఆయన ఎదిగారని చెప్పుకొచ్చారు. స్వీయక్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలని చంద్రబాబు తెలిపారు.

చైతన్యరథంపై రాష్ట్రంలో తిరుగుతూ ఎన్టీఆర్ ఘర్జించారని చెప్పారు. ఎన్టీఆర్ ప్రసంగిస్తుంటే ఘర్షించినట్లే ఉండేదని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనతలు ఎన్నో ఆయన అలవోకగా సాధించారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా అని, యువతకు భవిష్యత్తు అని, కార్మిక లోకానికి అండ అని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande