కడప, 28 మే (హి.స.)
పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు, పార్టీ భవిష్యత్తు కోసం నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. మహానాడును లోకేశ్ ఒక మలుపు తిప్పారని కితాబునిచ్చారు. భవిష్యత్తు కోసమే ఆ శాసనాలని అన్నారు. ఈ ఆరు శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని చెప్పారు. ఆర్థికంగా కార్యకర్తలను బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహానాడులో రెండో రోజు ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం మోపాలని చూశారని వైసీపీపై మండిపడ్డారు. ఏమీ తెలియనట్టు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. మెదడు చితికిపోయేలా వివేకాను దారుణంగా నరికి చంపారని అన్నారు. నేరస్తుల ఆటలు సాగబోవని చెప్పారు.
కోవర్టుల పట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టీడీపీలో వర్గపోరు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఖబడ్దార్... మీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత పోస్టులు పెట్టేవారి తాట తీస్తామని హెచ్చరించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఆగస్ట్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. కార్యకర్తలే టీడీపీ అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమని తెలిపారు. వలస పక్షులు వస్తుంటాయి, పోతుంటాయని... కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి