అమరావతి, 29 మే (హి.స.)
అమరావతి, :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. శుక్రవారం న్యూఢిల్లీలోని తాజ్ హోటల్లో జరగనున్న సీఐఐ ఏజీఏం సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. శుక్రవారం సాయంత్రం 4. 30 గంటల నుంచి 5. 30 గంటల మధ్య ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఆ రోజు రాత్రి ఢిల్లీలోనే ఆయన బస చేయనున్నారు. ఇక శనివారం ఉదయం 10.00 గంటలకు న్యూఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్కు ఆయన చేరుకోనున్నారు.
అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గునేపల్లికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఆ గ్రామంలోని పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా ఫించన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఆ తర్వాత స్థానిక గ్రామస్తులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని పార్టీ కేడర్తో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు ముమ్మిడివరం నుంచి ఆయన విజయవాడకు పయనమవుతారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జూన్ 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ రోజు ఆదివారం రావడంతో.. ఒక రోజు ముందే ఈ పెన్షన్ పంపిణి జరగనుంది.
మరోవైపు మే 27వ తేదీ కడప వేదికగా మహానాడు ప్రారంభమైంది. ఈ మహానాడు ఈ రోజుతో అంటే.. మే 29వ తేదీతో ముగియనుంది. అనంతరం ఈ రోజు సాయంత్రం కడప నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ