తిరుపతి, 29 మే (హి.స.)
x, :రాష్ట్రంలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఏనుగులు నానా హంగామా సృష్టిస్తుంటాయి. చేతికి వచ్చిన పంటలపై దాడి చేసి నాశనం చేస్తాయి. ఏనుగుల దాడిలో ఇప్పటికే ఎంతో మంది గాయపడగా.. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏనుగుల గుంపులను తరమిసేందుకు అటవీశాఖ సిబ్బంది కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏ క్షణం ఎక్కడి నుంచి గజరాజులు దాడి చేస్తాయో అని అక్కడి ప్రజలు వణికిపోతున్న పరిస్థితి. తాజాగా తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బోయిపల్లి అటవీప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.
డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల గుంపును గుర్తించిన అటవీశాఖ సిబ్బంది వాటిని అడవిలోనికి తరిమేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అటవీశాఖ సిబ్బందిపై ఏనుగులు తిరగబడ్డాయి. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. ఏనుగుల దాడిలో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కోటకాడపల్లి, ఎలమంద, ఉష్టికాయపెంట గ్రామాల ప్రజలు పొలాల వద్దకు వెళ్లవద్దవని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కాగా.. జంట ఏనుగులు సంచరిస్తున్న విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కూడా డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల కదలికలను గుర్తించి.. వాటిని బెదరగొట్టి తరిమేసేందుకు ప్రయత్నించారు. పంట చేతికొచ్చే సమయంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తే తీవ్ర నష్టం వాటిల్లితుంది. దీంతో గజరాజులను తరిమికొట్టేందుకు అటవీశాఖ సిబ్బంది యత్నించారు. అయితే అనుకోని విధంగా ఏనుగులు వీరిపై తిరగబడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ఎలిఫెంట్ టాస్క్ఫోర్స్ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీ ప్రసాద్ గాయపడగా... వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం వారు ఇద్దరు కోలుకుంటున్నారు. అయితే ఏ క్షణమైనా ఏనుగుల గుంపు వచ్చే అవకాశం ఉండటంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ