అమరావతి, 29 మే (హి.స.)
జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టాం అని, రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి పలికామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల కోసం పని చేస్తున్నాయని చెప్పారు. మార్కెట్లో ధరల పెరుగుదల ఉంటే.. సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పని చేస్తాయని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుతం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ షాపులో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరభ్ గౌర్ స్వయంగా పరిశీలించారు. ఈపోస్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా పని తీరును దగ్గరుండి మరీ చెక్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ‘జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తాం. 29,760 షాపుల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పేరుతో మాయ చేసింది. వేల కోట్లు దుర్వినియోగం అయ్యేలా చేశారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టాం. రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈకేవైసీ 96 శాతం పూర్తి చేశాం.. దేశంలోనే ఇది ఒక రికార్డు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి పలికాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల కోసం పని చేస్తున్నాయి’ అని చెప్పారు.
‘కోటి 46 లక్షల రేషన్ కార్డులు ఏపీలో ఉన్నాయి. జూన్ ఒకటి నుంచి 4.40 లక్షల మందికి సరుకులు ఇస్తున్నాం. మార్కెట్లో ధరలు పెరుగుదల ఉంటే సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా ఇస్తాం. ప్రతి రేషన్ షాపు ఫొటో తీసి యాప్ ద్వారా ఆన్ లైన్లో ఉంచాం. అన్ని షాపులకు ఈ సాయంత్రానికి సరుకులు చేరుతాయి. ఈపోస్ మిషన్, కాటా, సర్వీసింగ్ ఉచితంగా చేయిస్తున్నాం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించాం. 218 షాపు డీలర్ పసుపులేటి శివప్రసాద్ ముప్పై యేళ్లుగా డీలర్గా ఉన్నారు. వృద్దులు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి సరుకులు అందజేస్తాం. అన్ని విధాలా డీలర్లను కూడా ఇందుకు సన్నద్ధం చేశాం. 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పని చేస్తాయి. ఎండియూలు పది శాతం డబ్బులు కట్టారు. మిగతా డబ్బు కార్పొరేషన్ ద్వారా కట్టి.. వాహనాలు వారికే ఇస్తున్నాం. ప్రజలు కూడా రేషన్ షాపుల ద్వారానే ఇవ్వాలని కోరుతున్నారు. 15 రోజుల్లో వారికి వీలున్న సమయాల్లో సరుకులు తెచ్చుకుంటారు. 29,760 రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ ఉంటుంది. మార్కెట్లో పెరిగే వస్తువులను బట్టి.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే అందిస్తాం. ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం’ అని మంత్రి నాదెండ్ల తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ