తెలంగాణ, 29 మే (హి.స.)
దక్షిణ కాశీగా పేరుగాంచిన
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తున్నరంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని భక్తులేవరు నమ్మవద్దని ఆలయ ఈవో వినోద్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో రాజన్న ఆలయం మూసివేస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఈ.వో ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. వేములవాడ రాజన్న ఆలయం మూసివేత అంశంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, కానీ భక్తులేవరూ ఈ వార్తలను నమ్మవద్దని కోరారు.
భక్తులను తప్పుదోవ పట్టించే ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లోనూ ఎవరు షేర్ చేయవద్దని, వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి గానీ లేదంటే ఆలయ అధికారుల నుండి గానీ వస్తుందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను భక్తులు ఎవరు నమ్మవద్దని, ఇలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఇప్పటికే తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజన్న ఆలయానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా దేవస్థానం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని లేదంటే తమను నేరుగా సంప్రదించాలని భక్తులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు