అమరావతి, 30 మే (హి.స. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపిణీ చేయనుంది. సామాజిక భద్రత పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే.. అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పింఛను అందించేలా స్పౌజ్ పింఛను క్యాటగిరీని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది. గతేడాది నవంబరు 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య కాలానికి సంబంధించి స్పౌజ్ క్యాటగిరీలో పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో 71,380 మందిని అర్హులుగా తేల్చింది. వారందరికీ మే నెలకు సంబంధించిన పింఛను రూ.4 వేలు జూన్ 12న పంపిణీ చేయనుంది. జూన్ 11 నాటికల్లా ఈ పింఛన్ల మొత్తాలు గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ మేరకు సెర్ప్ సీఈవో వాకాటి కరుణ.. గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ