హైదరాబాద్, 30 మే (హి.స.)
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మావోయిస్టుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతం చావదని పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్ గఢ్ లోని అబుజ్మడ్ జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకుండా ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించడం తప్పని మండిపడ్డారు. అలాగే మావోయిస్టులను ఎన్కౌంటర్ల ద్వారా చంపడం లేదా అరెస్ట్ల ద్వారా అణచివేయడం వల్ల వారి సిద్ధాంతం అంతం కాదని స్పష్టం చేశారు.
మావోయిస్ట్ సిద్ధాంతం సామాజిక అసమానతలు, ఆర్థిక వివక్ష, మరియు అణచివేత వంటి సమస్యల నుండి ఉద్భవించింది. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే, సిద్ధాంతం జనంలో జీవించి ఉంటుందని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం మావోయిస్ట్ ఉద్యమాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూడకుండా, దాని వెనుక ఉన్న సామాజిక-ఆర్థిక కారణాలను అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..