హైదరాబాద్, 30 మే (హి.స.)
ఆంధ్రా మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 2004తోనే తెలంగాణలో చంద్రాబాబు చరిత్ర ముగిసిందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి ఆయన వల్లే జరిగిందంటే నవ్వొస్తుందంటూ ఎద్దేవా చేశారు. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.26 వేల లోపేనని స్పష్టం చేశారు. 2014 నుంచి ఆంధ్రలో మీ ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలంటూ చరకలంటించారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని చెప్పారు. అన్నిరంగాలు అభివృద్ధిలో దూసుకుపోయాయని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తెలంగాణాలో రూ.1.12 లక్షల తలసరి ఆదాయముంటే.. కేసీఆర్ పాలనలో రూ.3.70 లక్షలకు చేరిందన్నారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయ రూ.2.50 లక్షలు మాత్రమేనని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..