పల్నాడు జిల్లా, 30 మే (హి.స.)
పొదిలి, : అదుపుతప్పిన టిప్పర్..ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లడంతో కలకలం రేగింది. టిప్పర్ చోదకుడు మద్యం మత్తులో ఉండటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం చినకంచర్లకు చెందిన పెనుమాళ్ల లక్ష్మీనారాయణ గురువారం ద్విచక్రవాహనంపై పొదిలి వస్తున్నారు. అదే సమయంలో పొదిలి వైపు నుంచి వస్తున్న గ్రానైట్ టిప్పర్ కాటూరువారిపాలెం వద్ద అదుపు తప్పి లక్ష్మీనారాయణ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. అప్పటికీ వేగం నియంత్రణలోకి రాకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోలు బంకులోకి దూసుకెళ్లి లైటింగ్ బోర్డును ఢీకొని నిలిచిపోయింది. వెంటనే పెట్రోలు బంకు సిబ్బంది, స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ఆటోలో పొదిలి సామాజిక వైద్యశాలకు తరలించారు. టిప్పర్ చోదకుడు మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పెట్రోలు బంకు సిబ్బంది తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ