విశాఖ 30 మే (హి.స.)కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందుతుండడం చాలా ఆనందంగా ఉందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ జీతాల విషయంలో న్యాయం చేస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగుల మిగతా సమస్యలపై కూడా దృష్టిసారించాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల్లో ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, బకాయిల్లో ఇవి పది శాతం మాత్రమేనని చెప్పారు. నాలుగైదు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకుబకాయిలు పూర్తిగా ఆగిపోయాయని చెప్పారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపైనా దృష్టి సారించాలని, వాటి ద్వారా అన్ని ఆస్పత్రుల్లో సేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 12వ పీఆర్సీ వేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించలేదని, ఈ నెల 28న ప్రిన్సిపల్ సెక్రటరీతో జరిగిన సమావేశంలో సీఎంను కలిసే అవకాశం కల్పించాలని కోరినట్టు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ