అమరావతి, 31 మే (హి.స.)ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బీపీలో హెచ్చు తగ్గులు ఉండటంతో పీఎస్సార్ను విజయవాడ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మొదట్లో ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి కేసు పెట్టారంటూ పీఎస్సాఆర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏపీపీఎస్సీలో అనేక అవకతవలకు పాల్పడ్డారంటూ ఐపీఎస్ అధికారిపై అభియోగాలు నమోదు అయ్యాయి. పేపర్ మూల్యాంకణానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా వ్యవహారం నడిపించారని పీఎస్సార్తో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఇరువురిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు కూడా. రెండు రోజుల క్రితం జత్వానీ కేసులో హైకోర్టు ఐపీఎస్ అధికారికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీపీఎస్సీ కేసులో మాత్రం రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు.
ఇటీవల కాలంలో వయసు రీత్యా బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో ఆంజనేయులు ఇబ్బంది పడుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో వారం క్రితమే ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మళ్లీ ఈరోజు (శనివారం) గతంలో మాదిరిగానే బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో పీఎస్సార్ను జిల్లా జైలు అధికారులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఐపీఎస్కు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అనంతరం పీఎస్సార్ను తిరిగి జిల్లా జైలుకు తరలించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ