తెలంగాణ, వేములవాడ. 31 మే (హి.స.)
వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు ఎంతో భక్తితో సమర్పించే కోడెలు గత కొన్ని రోజులుగా వరుసగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 13 కోడెలు మృత్యువాత పడ్డాయి. ఈ క్రమంలో శనివారం తిప్పాపూర్ గోశాలలోని కోడెలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించి, వాటి దుస్థితిని చూసి చలించిపోయారు. అయ్యో పాపం కోడెలు అంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోడెలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులతో ఆదేశించారు. పాటు పశు వైద్య సిబ్బందిని ఆదేశించారు.
గోశాలలో వర్షపు నీరు నిలవకుండా మొరం, మట్టి పోయించాలని సూచించారు. బక్క చిక్కిన కోడెలను, మంచిగా ఉన్న వాటిని వేరువేరుగా ఉంచాలని అన్నారు. త్వరలోనే రైతులకు కోడెల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు 600 కోడెల సామర్థ్యం కలిగిన గోశాలలో ప్రస్తుతం 1200 కోడెలు ఉన్నాయని, వర్షపు నీరు నిల్వ ఉండడం, వారం రోజులుగా కోడెలకు పచ్చిగడ్డి సరఫరా చాలినంత అందకపోవడం, భక్తులు సంవత్సరంలోపు, బక్క చిక్కిన అనారోగ్యంతో బాధపడుతున్న కోడెలను తెచ్చి అప్పజెప్పి వెళుతుండటం వల్ల కోడెలు మృత్యువాత పడుతున్నట్లు పశు వైద్యాధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు