అమరావతి, 31 మే (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. పశ్చిమబెంగాల్- బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. దాంతో.. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమబెంగాల్కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఏపీ వ్యాప్తంగా మోస్తరు వర్షాలతోపాటు.. కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరించింది. అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలతోపాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది
శనివారం (31-05-2025) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,కర్నూలు, నంద్యాల,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి విజయనగరం జిల్లా గుర్లలో 87.5మిమీ, వైఎస్ఆర్ కడప జిల్లా సెట్టివారిపల్లిలో 87.5మిమీ, విజయనగరం జిల్లా వేపాడలో 79.2మిమీ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79మిమీ,అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74మిమీ వర్షపాతం నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి