తెలంగాణ, నిజామాబాద్. 31 మే (హి.స.)
దేశంలో శాంతిని చెడగొట్టే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ ఆరోపించారు. దేశ ప్రజలు మందిర్, మసీదు అంశం పై పోరాడుతూనే ఉండాలనేది ప్రధాని ఉద్దేశమని షబ్బీర్ అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా పర్సనల్ లాబోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన సమావేశం నిజామాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఏఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన బిల్లు ముఖ్య ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కాదని, ముస్లింల మసీదులు, దర్గాలు, శ్మశానవాటికలను స్వాధీనం చేసుకోవడానికే ఈ బిల్లు ప్రయత్నిస్తోందన్నారు.
రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును సెక్యులర్ పార్టీలు, సంఘాలు సమర్థించవద్దని ఆయన కోరారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు