హైదరాబాద్ 1 జూన్ (హి.స.), : దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ కాన్పుర్ ఆ రోజు ఉదయం 10 గంటలకు ర్యాంకులను వెల్లడించనుంది. 1.80 లక్షల మంది పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా. గత ఏడాది అడ్వాన్స్డ్లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. గత విద్యాసంవత్సరం(2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ విద్యాసంవత్సరం (2025-26) స్వల్పంగా సీట్లు పెరిగే అవకాశముంది. ఇప్పటికే ఐఐటీ మద్రాస్ రెండు కొత్త కోర్సులను ప్రవేశపెట్టి.. 80 సీట్లను అదనంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఐఐటీ బాంబే నాలుగేళ్ల బీఎస్ ఇన్ అప్లైడ్ జియో ఫిజిక్స్ అనే కోర్సును ప్రవేశపెట్టనుంది. అందులో ఎన్ని సీట్లు ఉంటాయన్నది వెల్లడవ్వాల్సి ఉంది. మరికొన్ని ఐఐటీల్లో కూడా కొద్ది మొత్తంలో సీట్లు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల అర్హత సాధించే వారి సంఖ్యను కొంత పెంచుతారని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఈసారి ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐఐటీ కాన్పుర్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ