అమరావతి, 1 జూన్ (హి.స.)
అమరావతి, , కృష్ణలంక, సీతారాంపురం: కళాశాలకు సంబంధించిన వివాదం నేపథ్యంలో విజయవాడలోని శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అపహరణకు గురైనట్లు కలకలం రేగింది. చివరకు పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. తెదేపా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అనుచరులు శుక్రవారం రాత్రి తన తండ్రి ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ను వాహనంలో కిడ్నాప్ చేసి గుంటూరు తీసుకెళ్లారని ఆయన కుమారుడు సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించారు. రాజా పీఏ రాజేష్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అపహరించారని పేర్కొన్నారు. ఇరువర్గాల మధ్య దీర్ఘకాలంగా శాతవాహన కళాశాల స్థలం వివాదం నడుస్తోందని సీఐ లక్ష్మీనారాయణకు వివరించారు.
ఘటన జరిగిన బందరు రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. అందులో ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్ భుజంపై చెయ్యి వేసి కారులో తీసుకెళ్తున్నట్లు నమోదు అయింది. బాధితుడి సెల్ టవర్ లొకేషన్ను పోలీసులు పరిశీలించగా.. గుంటూరులో చూపించింది. కారులో తీసుకెళ్లిన వారి లొకేషన్ కూడా అక్కడే చూపించింది. దీంతో కృష్ణలంక పోలీసులు గుంటూరు బయలుదేరారు. వాహనం కాజ టోల్గేట్ సమీపానికి వచ్చేసరికి కిడ్నాప్కు గురైన శ్రీనివాస్ కుమారుడు ఫోన్ చేసి తన తండ్రి ఫోన్లో మాట్లాడారని..క్షేమంగా ఉన్నట్లు చెప్పారని వివరించారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఎమ్మెల్సీతో మాట్లాడినట్లు సమాచారం. చివరకు ఒంటి గంట సమయంలో శ్రీనివాస్ విజయవాడలోని తన ఇంటికి చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ