తిరుమల క్యూ లైన్‌లో నినాదాలు చేసింది వైసీపీ నేతే.. బైండోవర్ కేసు నమోదు
తిరుమల, 1 జూన్ (హి.స.) తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లో నినాదాలు చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బద్దిలి అచ్చారావు (బాబ్జీ)గా అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు సన్నిహిత అనుచరుడిగా అ
తిరుమల క్యూ లైన్‌లో నినాదాలు చేసింది వైసీపీ నేతే.. బైండోవర్ కేసు నమోదు


తిరుమల, 1 జూన్ (హి.స.) తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లో నినాదాలు చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బద్దిలి అచ్చారావు (బాబ్జీ)గా అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు సన్నిహిత అనుచరుడిగా అతడికి పేరుంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అచ్చారావు స్థానికంగా ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఆలయ నూతన నిర్మాణానికి టీటీడీ నుంచి సుమారు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం గమనార్హం. అచ్చారావుకు తిరుమల యాత్ర కొత్తేమీ కాదని, సర్వదర్శనానికి పట్టే సమయం గురించి ఆయనకు ముందే అవగాహన ఉంటుందని, అయినప్పటికీ ఇలా ప్రవర్తించడం వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చారావు నినాదాలు చేస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోలో వైసీపీకి చెందిన తిమ్మాపురం సర్పంచి బెజవాడ సత్యనారాయణ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై తిరుమల పోలీసులు అచ్చారావుపై బైండోవర్‌ కేసు నమోదు చేశారు.

క్యూలైన్‌లో నినాదాలు చేసిన అచ్చారావుతో మాట్లాడామని, అసహనంతోనే ఆ విధంగా ప్రవర్తించినట్లు ఆయన చెప్పారని టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి మీడియాకు వెల్లడించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం, రద్దీ గురించి తెలియకపోవడం వల్ల దర్శనం ఆలస్యమవుతోందని భావించి నిరసన తెలిపినట్లు అచ్చారావు అంగీకరించారని చెప్పారు. క్యూలైన్‌లో అన్నప్రసాదాలు, పాలు అందిస్తుండటాన్ని గమనించి తన తప్పు తెలుసుకున్నారని, మానసిక క్షోభకు గురై, పశ్చాత్తాపంతో తమను క్షమించమని అచ్చారావు కోరినట్లు అదనపు ఈవో వివరించారు. భక్తులను రెచ్చగొట్టి, వీడియోలు తీసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande