అమరావతి, 1 జూన్ (హి.స.) కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో మళ్లీ వైసీపీ కుట్రలు మొదలయ్యాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల దర్శన కంపార్ట్మెంట్లో నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి కాకినాడ రూరల్ తిమ్మాపురానికి చెందిన వైసీపీ నాయకుడు బద్దిలి అచ్చారావు అని లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఒక పథకం ప్రకారం అతడితో వైసీపీ పేటీఎం బ్యాచ్ డ్రామా ఆడించి, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలోని పాలకమండలి తిరుమలలో భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తూ నిరంతరం సేవలు అందిస్తోందని కొనియాడారు. పవిత్ర తిరుమలపై తప్పుడు ప్రచారం చేసే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలకు వెనుకాడబోమని లోకేశ్ హెచ్చరించారు.
కాగా, క్యూలైన్లలో నిరసన వ్యక్తం చేసిన సదరు అచ్చారావు శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీకి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తన వైఖరి పట్ల విచారం వ్యక్తం చేసిన అచ్చారావు తనకు ఆరోగ్యం బాగాలేదని, నిరసన తెలిపితే త్వరగా దర్శనానికి అనుమతిస్తారనే ఉద్దేశంతో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు చెప్పారు. ఇలా చేయడం తప్పేనని అంగీకరించారు.
దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియక ఉద్రేకంతో విచక్షణ కోల్పోయి టీటీడీ పెద్దలను తప్పుబడుతూ నినాదాలు చేశానని ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్, అధికారులకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను లోకేశ్ ఎక్స్లో షేర్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి