పిఠాపురం, 1 జూన్ (హి.స.)ప్రభుత్వం చెప్పిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 29,796 రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ మేరకు పిఠాపురం (Pithapuram)లోని నూకాలమ్మ వీధిలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద రేషన్ షాపును పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేసి వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే అన్ని షాపుల వద్ద ఓ క్యూఆర్ కోడ్ (QR Code) కూడా పెట్టామని, వినియోగదారులు ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. సరైన సమయానికి రేషన్ తెరవకపోయినా.. తూకంతో పాటు క్వాలిటీలో ఎలాంటి తేడాలు ఉన్నా, ప్రజల ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక దివ్యాంగులు, వృద్ధుల కోసం సెపరేట్ వాట్సప్ (Whatsaap) గ్రూప్ క్రియేట్ చేశామని తెలిపారు. రేషన్ షాపు డీలర్లు నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లి సరుకులు ఇచ్చి.. ఆ ఫొటోలను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి