హైదరాబాద్, 12 జూన్ (హి.స.)
ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గోదావరి కృష్ణా నదీ పరివాహాక ప్రాంతాల్లో వీలైనంతవరకు ప్రాణ, ఆసీ, ఆర్ధిక నష్టం జరగకుండా ఇప్పటి నుండే పకడ్బందీ చర్యలు తీసుకొంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించేదానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్దాయిలో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యలు, విపత్తుల నిర్వహణా విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమీషనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమీషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్ & బీ, ఆరోగ్య శాఖల కమీషనర్లతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్