ఢీల్లీ, 12 జూన్ (హి.స.)
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా రూ.3 వేలకు మించి చేసే చెల్లింపులపై 0.3% మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధిస్తారంటూ బుధవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. దీంతో యూపీఐ వినియోగదారులకు ఊరట లభించినట్లయింది.
దేశంలో డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా ఏకంగా 83 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో, యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, యూపీఐ యాప్ల ద్వారా బ్యాంకు ఖాతాలోని నగదు నిల్వను పరిశీలించే ('బ్యాలెన్స్ చెక్') సదుపాయంపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. యూపీఐ వ్యవస్థపై అధిక ఒత్తిడిని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి