ఏలూరు, 13 జూన్ (హి.స.) :స్కూల్ పునఃప్రారంభం రోజున.. విధి నిర్వహణలో ఉండగానే.. గుండెపోటుతో ఓ హెచ్ఎం కుప్పకూలి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.వి.సురేశ్ కుమార్(47) తొలుత పాఠశాలలో స్టాఫ్ మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే సురేశ్ కుమార్ మృతి చెందారు. హెచ్ఎం సురేశ్కుమార్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జిల్లా విద్యాశాఖ తరఫున ఉపాధ్యాయులకు నిర్వహించే వివిధ శిక్షణ కార్యక్రమాలకు సురేశ్ డీఆర్పీగా వ్యవహరిస్తుంటారు. ఆయన మృతికి డీఈవో వెంకట లక్ష్మమ్మ, డీవైఈవో రవీంద్ర భారతి, ఎంఈవో అరుణ్ కుమార్, హెచ్ఎంల సంఘం జిల్లా నాయకులు సంతాపం తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ