బెంగళూరు, 14 జూన్ (హి.స.)
(యశ్వంతపుర), ఆధునిక కృతిమమేధ (ఏఐ) సాయంతో తిరుమల కొండపై శ్రీవారి దర్శనాన్ని గంటలోపే పూర్తి చేసుకునేలా సన్నాహాలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు బి.ఆర్.నాయుడు వెల్లడించారు. ఆయన బెంగళూరు నగరంలో తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల పురస్కారాన్ని స్వీకరించాక ప్రసంగించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల కొండపై భారీగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది హిందువుల మనోభావాలను గౌరవించేలా సనాతన ధర్మాన్ని రక్షించే దిశగా సంస్కరణలు చేపట్టామన్నారు. కొండపై హిందువేతర ఉద్యోగులను తొలగించామని, ఏడకొండల సమీపంలో ముంతాజ్ హోటల్ను ఇతర ప్రాంతాలకు తరలించామని వివరించారు. దళారుల వ్యవస్థను తుడిచిపెట్టుకు పోయిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం రూపురేఖలు మరింతగా మార్చేస్తామని భరోసా ఇచ్చారు. స్వామి కొండపై అన్య మతస్తులకు చోటు కల్పించబోమని స్పష్టం చేశారు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు మైసూరు మహారాజులు సమకూర్చిన భూములపై కర్ణాటక ప్రభుత్వానికి హక్కులు కల్పించాలన్న తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీనిచ్చారు. యదుగిరి యతిరాజ మఠాధిపతి యతిరాజ జీయరు స్వామి మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడేలా అధ్యక్షుడు బీఆర్ నాయుడు శ్రమిస్తున్నారని అభినందించారు. యతిరాజ మఠం తరఫున ఇదే వేదికపై బీఆర్ నాయుడికి ‘రామానుజ శ్రీ’ సేవా పురస్కారాన్ని అందించి సత్కరించారు. డాక్టర్ రాధాకృష్ణరాజు మాట్లాడుతూ తెలుగు విజ్ఞాన సమితి సేవలను ప్రస్తావించారు. 1978లో తితిదే అధ్యక్షుడిగా పనిచేసిన చెలికాని అన్నారావు ఈ సమితి భవన నిర్మాణానికి రూ.50 వేలు విరాళం అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఆర్.ఆదికేశవులు నాయుడు, కె.గంగరాజు, ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మీరెడ్డి, కోశాధికారి సీఏ వరదరాజు, మహిళా కార్యదర్శి లక్ష్మీశరత్, ప్రముఖులు జి.రమణబాబు, కృష్ణయ్యనాయుడు, గణేశ్శంకర్ తదితరులు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ