అమరావతి, 14 జూన్ (హి.స.)
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కటకటలాడుతున్నాయి. 2024-25 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత కింద సుమారు రూ.1,121 కోట్లను కేంద్రం 5 నెలల కిందటే రాష్ట్రానికి విడుదల చేసింది. ప్రభుత్వం వాటిని పంచాయతీలకు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా నిలిచిపోయాయని, గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని సర్పంచ్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కూటమి సర్కారు రాకతో పంచాయతీలకు మహర్దశ పట్టిందని భావిస్తున్న తరుణంలో నిధుల విడుదలలో తాత్సరంపై విమర్శలొస్తున్నాయి. పంచాయతీలకు సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరుతూ అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్లు ఇటీవల పాడేరు ఐటీడీఏ పరిధిలో ధర్నాలు నిర్వహించారు. నిధులు లేక పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయంటూ సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, అఖిల భారత్ పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు ఇప్పటికే పలుమార్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమా ర్, కమిషనర్ కృష్ణతేజను కలిసి విన్నవించారు. శుక్రవారం కమిషనరేట్లో కృష్ణతేజను జాస్తి వీరాంజనేయులు కలిసి 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ