అమరావతి, 14 జూన్ (హి.స.)
తిరుమల: తిరుమలలో నిన్న (శుక్రవారం) రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉండటంతో భక్తులకు దర్శన సమయం రెండు.. మూడు గంటలకు పైగా తగ్గుతుంది. దీంతో ఆరోజు కేవలం 60వేల నుంచి 65 వేల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే, ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో, వివిధ తితిదే విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే, జూన్లో శుక్రవారాల్లో సాధారణం కంటే అదనంగా 10వేల మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి మే 15 నుంచి విపరీతంగా పెరిగింది. శుక్రవారాలైన మే 23న 74,374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది, జూన్ 13న 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు తితిదే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ