హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈవో డా, జైతీర్థ ఆర్. జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్డిఎల్ డైరెక్టర్ జీ.ఏ. శ్రీనివాస మూర్తి, తదితరులు సీఎంతో భేటీ అయ్యారు.
హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని సీఎం వారిని కోరారు. హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని రేవంత్ వివరించారు.
ఇప్పటికే హైదరాబాద్ లో డిఫెన్స్ కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్