అమరావతి, 18 జూన్ (హి.స.)
రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. దేవీపట్నం మండలం కొండమొదలు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరిలో ఇటీవల మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య, స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు¸ గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
2018లో డుంబ్రిగుడ సమీపంలో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో అరుణ నిందితురాలిగా ఉన్నారు. ఆమె స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఉదయ్పై రూ.25లక్షలు, అరుణపై రూ.20లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి మారేడుమిల్లి సీఐ, దేవీపట్నం ఎస్సై, పోలీసు సిబ్బంది బయల్దేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ