హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
హైదరాబాద్ ప్రతిష్టాత్మక సంస్థకు వేదికైంది. హైటెక్ సిటీలోని గూగుల్ దివ్యశ్రీ భవన్లో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేసిన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.
ఇండియాలో మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను (GSEC) హైదరాబాద్లో ఏర్పాటు చేయడం విశేషం. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత గూగుల్ నెలకొల్పుతున్న రెండో సెంటర్ ఇది.. ప్రపంచంలోనే ఐదవది. GSEC అనేది అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. అధునాతన భద్రతతో పాటు ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత భద్రత, అత్యాధునిక పరిశోధన, సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేస్తున్న నిపుణులు, పరిశోధకులకు చక్కని ప్లాట్ఫాంగా ఉపయోగపడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..