తెలంగాణ,పెద్దపల్లి. 18 జూన్ (హి.స.)
అంగన్వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ పూర్వ ప్రాథమిక విద్యను పకడ్బందీగా అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సంక్షేమ శాఖ పని తీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ తో కలిసి కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. టాయిలెట్ లేని అంగన్ వాడీ కేంద్రాల జాబితా సిద్ధం చేసి వెంటనే టాయిలెట్స్ నిర్మించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు అక్షరాలు, సంఖ్యల గుర్తింపు, రాయడం వంటి అంశాలలో పురోగతి సాధించాలని, పూర్వ ప్రాథమిక విద్య గురించి ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంబంధిత పౌష్టికాహారం తప్పనిసరిగా అందేలా చూడాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు