విజయనగరం, 18 జూన్ (హి.స.)
బొండపల్లి: జిల్లా బొండపల్లి మండలం చామలవలస గ్రామం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై యూ.మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బొండపల్లి గ్రామంలో బంగారమ్మ తల్లి - నగలపోలమ్మ తల్లి సంబరాలు జరుగుతున్నాయి. బొండపల్లికి చెందిన ముగ్గురు యువకులు దినేశ్ (20), రమణ (21), సతీష్ (20) వేడుకలు చూసేందుకు వచ్చారు. అనంతరం ద్విచక్రవాహనంపై బొండపల్లి నుంచి సుమారు 5కి. మీలో దూరంలో ఉన్న చామలవలస గ్రామంలోని బావిలో ఈత కొట్టడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ