అమరావతి, 18 జూన్ (హి.స.)
, దిల్లీ, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది. అమరావతిలో రెండు కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహసముదాయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులను రూ.2,787 కోట్లతో చేపట్టనుంది. వాటిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి (కామన్ సెంట్రల్ సెక్రటేరియట్)కి రూ.1,458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి (జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్)కి రూ.1,329 కోట్లు వెచ్చించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసి, మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ