కర్నూలు, 2 జూన్ (హి.స.)
:పారిశ్రామిక హబ్గా రాష్ట్రం శరవేగంగా దూసుకుపోతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలో కాపు భవన్ నిర్మాణానికి రూ.కోటి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం బలిజ సంఘం ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. పది, ఇంటర్లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈసందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ బీసీలు, మైనార్టీలతో పాటు కాపుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనతి కాలంలోనే అనేక పరిశ్రమలు తీసుకువచ్చామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తన వద్దే పరిశ్రమల శాఖను ఉంచుకుని స్వయంగా పర్యవేక్షించారని, అలాంటి కీలక శాఖను తనపై నమ్మకంతో ఇచ్చారని, సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ