తిరుమల, 2 జూన్ (హి.స.),:తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం చిరుత సంచారం కలకలం రేపింది. మార్గంలోని 500 మెట్టు వద్ద ఉన్న పొదల్లో ఓ చిరుత కనిపించినట్టు కొందరు భక్తులు సమీపంలోని భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో ఫారెస్ట్ సిబ్బందితో కలిసి వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఆ ప్రదేశంలో చిరుత జాడలేమి కనిపించలేదు. అయినప్పటికీ చిరుత ఉంటే అడవిలోకి వెళ్లిపోయేలా సైరన్లు వేశారు. అలాగే కాలినడక భక్తులను అప్రమత్తం చేసి, తిరుమలకు పంపారు. చిన్నపిల్లలను ఒంటరిగా విడిచిపెట్టవద్దంటూ సూచనలు చేశారు. శనివారం సాయంత్రం కూడా శిలాతోరణానికి సమీపంలోని మూర్తినాయన చెరువు సమీపంలో ఓ చిరుత సంచరించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. జనసంచారంలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ