కర్నూలు 2 జూన్ (హి.స.) జిల్లాలోని గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ప్రమాదం పొంచి ఉంది. కీలకమైన మట్టి ఆనకట్ట రాతి పరుపు (స్టోన్ రివెట్మెంట్) కుంగిపోతోంది. నాలుగు చోట్ల రాతిపరుపు నీటిలోకి జారిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మట్టి ఆనకట్ట పనులను అసంపూర్తిగా వదిలేశారు. రాతి పరుపు, మట్టి మధ్యలో వర్షపు నీరు చేరుతుండడంతో శాండ్ ఫిల్టర్ మీడియా దెబ్బతిని (వాష్అవుట్) స్టోన్ రివెట్మెంట్ జారిపోతోందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఈ నెల 13న సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈ విజయభాస్కర్రెడ్డి, ఎస్ఈ శివశంకర్రెడ్డి బృందం రిజర్వాయర్ను తనిఖీ చేసింది. మట్టికట్ట బ్యాలెన్స్ పనులు, అప్టెక్ స్లూయిస్, జలాశయం డౌన్ స్ట్రీమ్ డ్రైన్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో బ్యాలెన్స్ మట్టికట్ట, అప్టెక్ (ఓటీ) నిర్మాణం, శాశ్వత మరమ్మతులకు ఇంజనీర్లు రూ.58 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. తాత్కాలిక మరమ్మతులకు నంద్యాల కలెక్టర్ జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి రూ.2.50 కోట్ల నిధులు ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయాలని రాయలసీమ సాగునీటి రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ